chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:37 am Digital Edition : CHITTOORE EXPRESS

రోగుల సేవలో విక్టరీ బోర్డింగ్ పాఠశాల మరో ముందడుగు

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 06:

 

కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని విక్టరీ బోర్డింగ్ పాఠశాల ఆధ్వర్యంలో నాలుగు వీల్‌చైర్లను విరాళంగా అందజేశారు. చిత్తూరు జిల్లా వికలాంగుల శాఖ అధికారుల సహకారంతో ఈ వీల్‌చైర్లను ఆసుపత్రి యాజమాన్యానికి అందించారు. ఈ సందర్భంగా విక్టరీ బోర్డింగ్ పాఠశాల వ్యవస్థాపక అధ్యక్షుడు గోవిందరాజులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజూ వందలాది మంది రోగులు చికిత్స కోసం వస్తుంటారని, వారిలో వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, నడవలేని స్థితిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి అవసరాలను గుర్తించి సామాజిక బాధ్యతలో భాగంగా చిత్తూరు జిల్లా వికలాంగుల శాఖ అధికారుల సహకారంతో నాలుగు వీల్‌చైర్లను విరాళంగా అందించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సమాజంలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారం అందిస్తే రోగులకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యా సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా తమ సంస్థ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది విక్టరీ బోర్డింగ్ పాఠశాల యాజమాన్యానికి, చిత్తూరు జిల్లా వికలాంగుల శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీల్‌చైర్లు అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఒక విభాగం నుంచి మరో విభాగానికి తరలించడానికి, ముఖ్యంగా వయోవృద్ధులు, నడవలేని రోగులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అందించిన ఈ విరాళం సేవాభావానికి నిదర్శనంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.