
పలమనేరు,చిత్తూరు ఎక్స్ప్రెస్, జూలై 26:
పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి ఈ నెల 27వ తేదీ సోమవారం నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు పెద్దపంజాణి మండలంలో విస్తృతంగా పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 40 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన కొనసాగనుంది. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు ఇంటింటికి వెళ్లి వివరించడంతో పాటు స్థానిక ప్రజలసమస్యలను నేరుగా తెలుసుకునివాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడం ప్రధాన లక్ష్యంగా ఉందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ నెల 27న శంకర్రాయలపేటలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి, శివాడి,నిడిగుంట,ముదరంపల్లి,బొమ్మరాజుపల్లి, అమ్మరాజు పల్లిలో పర్యటించనున్నారు. 28వ తేదీన అప్పినపల్లి, చామనేరు, పెద్దవెలగటూరు, రాజుపల్లి గ్రామాల్లో, 29న లింగాపురం, ముత్తుకూరు, కరసనపల్లి, మాదనపల్లిలో, 30న పెద్దారీకుంట, బట్టందొడ్డి, చలమంగళంలో పర్యటిస్తారు. అనంతరం 31వ తేదీన పెద్దపంజాణి, కొలత్తూరు, కోగిలేరు గ్రామాల్లో పర్యటించగా, ఆగస్టు 1న నాగిరెడ్డిపల్లి, పెద్దకాప్పల్లిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు గ్రామస్థులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు, అధికారులు పాల్గొననున్నట్లు వెల్లడించారు.