chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 9:57 pm Digital Edition : CHITTOORE EXPRESS

రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేసిన  కడ పీడి వికాస్ మర్మత్

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 17:

 

కుప్పం ప్రాంతంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల పనితీరును సమీక్షించేందుకు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామకుప్పంలోని బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల, కడపల్లె గురుకుల పాఠశాల, గణేశ్‌పురంలోని ఎంఎజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ పాఠశాలలను ఆయన సందర్శించారు. పాఠశాలల సందర్శనలో భాగంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ప్రాజెక్ట్ డైరెక్టర్, హాస్టల్ సదుపాయాలు, భోజన నాణ్యత, రోజువారీ నిర్వహణపై వివరంగా ఆరా తీశారు. విద్యార్థుల నుంచి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటూ, మెరుగుపరచాల్సిన అంశాలను గమనించారు. అనంతరం ఆయన స్వయంగా భోజనం నాణ్యతను పరిశీలించి, ఆహారం పరిశుభ్రత, ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొన్ని చోట్ల మరింత మెరుగులు చేర్చాలని సంబంధిత సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఇంకా పాఠశాలలలో పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, వసతి గదుల పరిస్థితి, విద్యార్థులకు అందుతున్న ఇతర సౌకర్యాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని, అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.