chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 8:57 pm Digital Edition : CHITTOORE EXPRESS

యోగ, భరతనాట్యంలో రాణిస్తున్న కుప్పం బాలిక తేజశ్రీ రాష్ట్రస్థాయిలో ప్రతిభకు సీఎం చంద్రబాబు అభినందనలు

 

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 04:

 

కుప్పం పట్టణానికి చెందిన విద్యార్థిని తేజశ్రీ యోగాతో పాటు భరతనాట్యంలోనూ విశేష ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. చిన్న వయసులోనే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతూ కుప్పం పేరు నిలబెట్టిన తేజశ్రీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. కుప్పం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తేజశ్రీ, జయప్రకాశ్ రోడ్డులో నివసిస్తున్న శ్యామల – కృష్ణమరాజు దంపతుల కుమార్తె. విద్యాభ్యాసంతో పాటు యోగా, భరతనాట్యంలోనూ సమానంగా రాణిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో మూడో స్థానం సాధించిన తేజశ్రీ, ఇటీవల నిర్వహించిన యోగాసన పోటీల్లోనూ రాష్ట్రస్థాయిలో పోటీ పడుతూ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. క్రమశిక్షణతో సాధన చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్న ఈ విద్యార్థిని కుప్పం ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కుప్పం పర్యటనలో భాగంగా కంగుంది గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో తేజశ్రీ ప్రతిభను గుర్తించి అభినందించారు. ఆమెను మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకోవడం పట్ల తేజశ్రీ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తేజశ్రీ భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించి కుప్పం, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని స్థానికులు, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.