chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 9:23 am Digital Edition : CHITTOORE EXPRESS

యోగాతో ఆరోగ్యవంతమైన కుప్పం నిర్మాణం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు   కడ పిడి వికాస్ మర్మత్ 

 

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 21:

 

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను కుప్పంలోని ఎంఎఫ్‌సీ కళాశాల మైదానంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, యువత, మహిళలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పి.ఎస్. మునిరత్నం, ప్రియా మీనా తదితరులు పాల్గొని యోగా సాధన చేశారు. వివిధ యోగా ఆసనాలను అభ్యసిస్తూ యోగా ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వికాస్ మర్మత్ మాట్లాడుతూ.. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమని పేర్కొన్నారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, రోగనిరోధక శక్తి పెరుగుతాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, “ఆరోగ్య ఆంధ్రప్రదేశ్” లక్ష్య సాధనలో భాగంగా యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, కుటుంబ సభ్యులతో కలిసి నిత్యం యోగా సాధన చేస్తే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక, ఆధ్యాత్మిక వికాసం కూడా సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమం ముగింపులో యోగాను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఆరోగ్య వంతమైన కుప్పం, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు,విద్యార్థులు,యువత, మహిళలు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని యోగా దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతం చేశారు.