chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 11:38 am Digital Edition : CHITTOORE EXPRESS

మోడల్ కాలనీ బోరులో పుష్కలంగా నీరు

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 05:

 

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 11వ క్లస్టర్ మోడల్ కాలనీలో తాగునీటి అవసరాల కోసం ఇటీవల తవ్వించిన నూతన బోరులో పుష్కలంగా నీరు లభించడం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని నింపింది. సుమారు 450 అడుగుల లోతులోనే మూడున్నర అంగుళాల నీటి ప్రవాహం లభించడంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కుప్పం ప్రాంతంలో 1000 అడుగుల లోతువరకు బోర్లు తవ్వినా నీరు లభించ ని పరిస్థితులు ఉండేవని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అయితే హంద్రీ-నీవా జలాల రాకతో కుప్పం ప్రాంతంలో భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరిగిందని పేర్కొంటున్నారు. హంద్రీ- నీవా కాలువ ద్వారా కుప్పం ప్రాంతానికి నీటిని అందించడంతో భూగర్భ జలాల పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందని, ప్రస్తుతం తక్కువ లోతులోనే నీరు లభించడం ఇందుకు నిదర్శనమని స్థానిక నాయకులు తెలిపారు. దీంతో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న మోడల్ కాలనీ ప్రజలకు ఊరట లభించనుందని పేర్కొన్నారు. నూతన బోరు ద్వారా కాలనీలోని కుటుంబాలకు తగినంత తాగునీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా వేసవి కాలంలో నీటి కొరత సమస్య గణనీయంగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడల్ కాలనీలో చేపట్టిన ఈ తాగునీటి సదుపాయం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. నూతన బోరులో నీరు లభించడంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ, తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.