
రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 01:
మైనర్ బాలురు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని రేణిగుంట పోలీసులు హెచ్చరించారు. రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల వద్ద మైనర్ బాలుడు వాహనం నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మైనర్ బాలుడితో పాటు అతని తల్లిదండ్రులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, ఇందుకు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు. మైనర్ బాలురు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహనం నడిపిన బాలుడితో పాటు వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రేణిగుంట పోలీసులు హెచ్చరించారు.