chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 6:16 am Digital Edition : CHITTOORE EXPRESS

మే 3న నిర్వహించనున్న నీట్–2026 పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేయాలి ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి:  డీఆర్ఓ కే. మోహన్ కుమార్

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 29:

 

మే 3న చిత్తూరు పట్టణంలో నిర్వహించనున్న నీట్–2026 ప్రవేశ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే. మోహన్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని డీఆర్ఓ సమావేశ మందిరంలో నీట్ పరీక్షల నిర్వహణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే నీట్–2026 పరీక్ష చిత్తూరు జిల్లా కేంద్రంలోని మూడు పరీక్షా కేంద్రాలలో జరగనుందని తెలిపారు.

పరీక్షా కేంద్రాలు మరియు అభ్యర్థుల వివరాలు:

పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల – 456 మంది,

సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల – 220 మంది,

లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ – 384 మంది,

మొత్తం 1,060 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష మే 3, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన డీఆర్ఓ, పరీక్షా కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాలని, తల్లిదండ్రుల కోసం షామియానాలు, త్రాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని, వాటి భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి కేంద్రంలో రెవెన్యూ మరియు పోలీస్ శాఖల నోడల్ అధికారులు పర్యవేక్షణలో ఉండాలని, లైటింగ్, ఫ్యాన్లు, సిట్టింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పోలీస్, విద్యుత్, విద్యాశాఖ, వైద్యశాఖ, పోస్టల్ శాఖ అధికారులు, నోడల్ అధికారి జీవనజ్యోతి, ఎమ్మార్వోలు, కళాశాల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.