chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 3:56 pm Digital Edition : CHITTOORE EXPRESS

మీరు సక్రమంగా పనులు చేయగలరా.. చేయలేరా అభివృద్ధి పనుల్లో పురోగతి ఏది మాటలతో కాలాన్ని వృధా చేయడం తగదు నెల రోజుల్లోపే అభివృద్ధి పనులు మొదలవ్వాలి..  లేకుంటే చర్యలు తప్పవు అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే ఆగ్రహం

పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 18:

 

పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో మీరు కలసి సక్రమంగా పని చేయగలరా… చేయలేరా అంటూ స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయించినప్పటికీ అధికారుల అలసత్వంతో పనులు ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఆయన శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మురుగునీరును శుద్ధి చేసే ఎస్టిపి ప్లాంట్ అంశంపై రోజులు గడుస్తున్న సమస్య కొలిక్కి రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మున్సిపల్, రెవిన్యూ అధికారులు ప్రత్యేక చొరవ చూపడం లేదని కాలయాపన చేయడం తప్పితే అడుగైన ముందుకు పడడం లేదని అసహనానికి గురయ్యారు. దాంతోపాటు సుమారు మూడు కోట్ల రూపాయల నిధులు ఉన్నప్పటికీ మున్సిపల్ పరిధిలో రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని నిలదీశారు. అభివృద్ధిలో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదని సమయాన్ని వృధా చేయడం తప్పా ఏమాత్రం పనులు జరగడం లేదన్నారు. నెల రోజుల్లోపు అభివృద్ధి పనులన్ని ప్రారంభమయ్యేలా చూడాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరిష్కార మార్గాల వెంటనే పూర్తి చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇక కొన్ని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి పోలీసులు సహకరించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ఆర్డీవో భవాని, తహసిల్దార్ ఇన్భనాధన్, డి.ఎస్.పి డేగల ప్రభాకర్, కమిషనర్ ఎన్వి రమణారెడ్డి,టి పి ఎస్ ఇందిరా, మున్సిపల్ డిఈ మరియు ఏఈలు పాల్గొన్నారు.