
చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 02:
చిత్తూరు జిల్లాలో మాతా-శిశు మరణాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య అధికారులను ఆదేశించారు. గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంతో పాటు శిశు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం లో మాతా-శిశు మరణాలపై వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన మాతా-శిశు మరణాల వివరాలు, వాటికి గల కారణాలు,నివారణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. గర్భిణులకు ప్రారంభ దశ నుంచే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని, అధిక ప్రమాద గర్భధారణ కేసులను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవ సేవలను మరింత మెరుగుపరచి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, జననం అనంతరం అవసరమైన వైద్య పరీక్షలు, టీకాలు, పోషకాహార సేవలు తప్పనిసరిగా అందించాలని సూచించారు. గ్రామ, మండల స్థాయిలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని చెప్పారు. వైద్య సేవల నాణ్యత పెంపుతో పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల ని, మాతా-శిశు మరణాలను పూర్తిగా నివారించే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.