
సిద్ధవటం,చిత్తూరు ఎక్స్ప్రెస్, జూలై 17:
సిద్ధవటం మండలంలోని మాచుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శుక్రవారం సందర్భంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు సుబ్బరాజు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం అమ్మవారి మూలవిరాట్టుకు పవిత్ర జలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి, వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక అర్చనలు, కుంకుమార్చనలు, మహామంగళహారతులతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు మాచుపల్లి గ్రామంతో పాటు సిద్ధవటం మండలంలోని పరిసర గ్రామాలు, జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూ లైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు సుబ్బరాజు భక్తులకు వేద ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేసి, దర్శనానికి ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. విశేష పూజలు ప్రశాంతంగా, భక్తి పారవశ్య వాతావరణంలో ముగిశాయి.