chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 8:39 am Digital Edition : CHITTOORE EXPRESS

మధుమేహ నియంత్రణకు జీవనశైలిలో మార్పులు తప్పనిసరి పీఈఎస్‌ఐఎంఎస్‌ఆర్‌ ఆసుపత్రిలో డయాబెటిస్‌ సపోర్ట్‌ గ్రూప్‌ సమావేశం

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 29:

 

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే మందులతో పాటు సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, తగినంత విశ్రాంతి, నిరంతర ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా పాటించాలని పీఈఎస్‌ఐఎంఎస్‌ఆర్‌ ఆసుపత్రి వైద్యనిపుణులు సూచించారు. ఆసుపత్రిలోని ఎండోక్రైనాలజీ, డయాబెటాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు నెలకు సంబంధించిన డయాబెటిస్‌ సపోర్ట్‌ గ్రూప్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 30 మంది మధుమేహ రోగులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుమేహ నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవనశైలి,ఆహార నియమాలు, వ్యాయామం,రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాల్సిన అవసరంపై వైద్యులు అవగాహన కల్పించారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని వివిధ అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని, అందువల్ల వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన వైద్య సలహాలు తీసుకోవాలని సూచించారు.

రోగుల సందేహాలకు వైద్యుల సమాధానాలు సమావేశంలో మధుమేహ రోగులు తమ ఆరోగ్య సమస్యలు, ఆహారపు అలవాట్లు, మందుల వినియోగం, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ తదితర అంశాలపై వైద్యులను ప్రశ్నించారు. వైద్యనిపుణులు వారి సందేహాలను నివృత్తి చేస్తూ మధు మేహాన్ని నియంత్రణలో ఉంచుకునేందు కు పాటించాల్సిన విధానాలను వివరించారు. వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకోవడంతో పాటు రోజు వారీ జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలని తెలిపారు. ఆహారం, వ్యాయామంపై అవగాహన మధుమేహ నియంత్రణలో ఆహార నియమాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని చీఫ్‌ డైటీషియన్‌ సూచించారు. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని, మందులను వైద్యుల సలహా మేరకే వినియోగించాలని వైద్యులు తెలిపారు.రోజువారీజీవితంలో శారీరక శ్రమను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచు కోవచ్చని ఫిజికల్‌ థెరపీ విభాగం సిబ్బంది వివరించారు. నిరంతర ఆరోగ్య అవగాహన అవసరం మధుమేహం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య కావడంతో ఒకసారి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు పేర్కొన్నారు. వ్యాధి నియంత్రణలో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. మధుమేహ రోగులకు నిరంతరం ఆరోగ్య విద్య,వైద్య సలహాలు అందించడమే లక్ష్యంగా డయాబెటిస్‌ సపోర్ట్‌ గ్రూప్‌ సమావేశాలను నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎండోక్రైనాలజీ,డయాబెటాలజీ విభాగం వైద్యులు, చీఫ్‌ డైటీషియన్‌, ఫిజికల్‌ థెరపీ, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొని రోగులకు పలు సూచనలు అందించారు. మధుమేహ నియంత్రణకు ఆసుపత్రి అందిస్తున్న అవగాహన, సహకారాన్ని రోగులు అభినందించారు.