
మదనపల్లి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 24:
మదనపల్లి పట్టణంలోని నీరుగుట్టపల్లి, వన్టౌన్ ప్రాంతాల్లో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు,కుప్పం, దుత్తలూరు, బంగారుపాళ్యం, పలమనేరు, వి.కోట, శివరామపురం, పొదలకూరు, శ్రీకాళహస్తి, నరసరావుపేట కమిటీల అధ్యక్షులు, సభ్యులు ఇంటింటికి వెళ్లి త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రజలకు పరిచయం చేశారు. జీవాత్మ,ఆత్మ,పరమాత్మ అనే మూడు ఆత్మల ఆధారంగా శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత సారాన్ని ప్రజలకు వివరించారు. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన 101 త్రైత సిద్ధాంత గ్రంథాలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ప్రజలు ఆసక్తి కనబరిచి గ్రంథాలను స్వీకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని ఉద్దేశంతో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డి. సురమౌళి, కె. అశోక్బాబు, డి. బాలాజీ, కృష్ణ, రెడ్డి భాస్కర్, మల్లికార్జున, జి. ప్రసాద్, పెంచల నరసయ్య, చింత సుబ్రహ్మణ్యం తదితరులతో పాటు వివిధ కమిటీలకు చెందిన 100 మందికి పైగా సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.