శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ప్రెస్, జూలై 14
శ్రీకాళహస్తి పట్టణంలోని బాబు అగ్రహారం ఉన్నత పాఠశాలలో ఆధ్యాత్మిక అవధూత మాసపత్రిక 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ సీఐ వెంకటేష్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో పదో తరగతి అత్యంత కీలకమైన దశ అని, ఈ సమయంలో మంచి అలవాట్లు అలవరుచుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. కొంతమంది విద్యార్థులు హాన్స్ వంటి మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొంటూ, అలాంటి అలవాట్లు ఉన్నవారు వెంటనే వాటికి దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మారేందుకు అవకాశం ఇస్తామని, అయినప్పటికీ మారకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు ఆనందరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పంపిణీ చేసిన డైరీలు ఎంతో ఉపయోగకరమని, అందులోని విలువైన అంశాలను ప్రతిరోజూ చదివి ఆచరణలో పెడితే మంచి భవిష్యత్తు నిర్మించుకో వచ్చని అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో పాఠశాల అత్యుత్తమ ఫలితాలు సాధించిందని తెలిపారు. విద్యార్థిని పూజిత సాధించిన ప్రతిభకు గుర్తింపుగా సత్కారం జరిగిందని పేర్కొంటూ, ఈ ఏడాది కూడా విద్యార్థులంతా అదే స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
