chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 8:33 am Digital Edition : CHITTOORE EXPRESS

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి..  భవిష్యత్తును కాపాడుకోండి శ్రీ సిటీ పోలీసుల మెగా గంజాయి పరీక్షల కార్యక్రమం

సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్03:

 

తిరుపతి జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో శ్రీసిటీ పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణను కొన సాగిస్తోంది. యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు మెగా గంజాయి పరీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆదేశాలు, తిరుపతి జిల్లా పోలీసు అధికారుల పర్యవేక్షణలో జిల్లావ్యాప్తంగా గంజాయి నిర్మూలన చర్యలు ముమ్మరంగా కొనసాగుతు న్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఉపవిభాగంలో ప్రత్యేక తనిఖీలు, పరీక్షలు నిర్వహిస్తూ మత్తు పదార్థాల వినియో గాన్ని గుర్తించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ సిటీ ఉపవిభాగ పరిధిలో డీఎస్పీ బి.వి. శ్రీనివాసులు పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీనివాసులు, సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. సుధీర్‌కుమార్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో మెగా గంజాయి పరీక్షల కార్యక్రమం చేపట్టారు. వరదయ్య పాలెం మండలం చిన్నపాండూరు ప్రాంతంలోని అపోలో పరిశ్రమ కార్మికులు, సత్యవేడు మండలం మదనపాలెం గ్రామంలోని శాంక్యూ ఇండియా కార్మికులపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో అనుమానితులుగా గుర్తించిన వారికి గంజాయి వినియోగ నిర్ధారణ కోసం ప్రత్యేక కిట్లతో పరీక్షలు నిర్వహించారు. గంజాయి వినియోగదారులను కేవలం చట్టపరమైన చర్యలకు మాత్రమే పరిమితం చేయకుండా, వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సన్మార్గంలోకి తీసుకురావడంపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి.వి. శ్రీనివాసులు మాట్లాడుతూ… మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజ శాంతిభద్రతలకు కూడా తీవ్ర హాని కలిగిస్తుందని అన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని సూచించారు. గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972 (ఈగల్) లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే ‘డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా’ లక్ష్యాన్ని సాధించగలమని తెలిపారు. పరిశ్రమల యాజమాన్యాలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, యువత మరియు ప్రజలు పోలీసు శాఖకు సహకరించి మత్తు పదార్థాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ నిరంతర చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.