chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 7:26 am Digital Edition : CHITTOORE EXPRESS

భూగర్భ జలాల పరిరక్షణలో అటల్ భూజల్ యోజన విజయవంతం దేశవ్యాప్తంగా 229లో 180 బ్లాకుల్లో భూగర్భ జల మట్టాలు మెరుగుదల ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వ సమాధానం

చిత్తూరు/ఢిల్లీ, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 23:

 

దేశంలో భూగర్భ జలాల నిర్వహణ, పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అటల్ భూజల్ యోజన (ABY) ఆశించిన ఫలితాలను సాధించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్లు చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం,గుజరాత్,హర్యానా,కర్ణాటక,మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 80 జిల్లాల పరిధిలో 229 బ్లాకులకు చెందిన 8,203 నీటి ఎద్దడి గ్రామపంచాయతీల్లో ఈ పథకాన్ని 2020 ఏప్రిల్ 1 నుంచి 2025 అక్టోబర్ 15 వరకు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. పథకం అమలుపై క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) నిర్వహించిన సమగ్ర ప్రభావ అంచనా అధ్యయనంలో 229 బ్లాకుల్లో 180 బ్లాకుల్లో భూగర్భ జల మట్టాలు మెరుగుపడినట్లు తేలిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం అమలులో రాష్ట్రాల పనితీరు ఆధారంగా నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా పథకం కోసం రూ.4,000.80 కోట్లు విడుదల చేయగా, అందులో రూ.3,922.21 కోట్లు సద్వినియోగం అయ్యాయని కేంద్రం పేర్కొంది.భూగర్భ జలాల పరిరక్షణలో మహిళలు పెద్దఎత్తున భాగస్వామ్యులై నిర్ణయాల ప్రక్రియలో కీలక పాత్ర పోషించారని నివేదిక వెల్లడించింది. అలాగే సామర్థ్య పెంపుదల, అవగాహన కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజల్లో భూగర్భ జలాల సంరక్షణపై చైతన్యం పెరిగిందని తెలిపింది. నిర్ణీత కాలపరిమితితో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, కమ్యూనిటీ ఆధారిత భూగర్భ జల నిర్వహణకు అటల్ భూజల్ యోజన ఆదర్శ నమూనాగా నిలిచిందని కేంద్ర మంత్రి సమాధానంలో పేర్కొన్నట్లు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు.