
గుడిపల్లి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 22:
కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం బెగ్గిలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ధైర్య–స్పర్శ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ధైర్య స్పర్శ వాహనంతో కలిసి కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, గుడుపల్లె ఎస్సై శ్రీకాంత్ మరియు పోలీసు సిబ్బంది గ్రామాన్ని సందర్శించి ప్రజలకు పలు ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి రోడ్డు భద్రత నియమాలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, సందేశాలకు స్పందించవద్దని తెలిపారు. అదేవిధంగా ధైర్య–స్పర్శ సేవల గురించి వివరించి, అవసరమైతే వెంటనే సహాయం పొంద వచ్చని తెలిపారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల ను వివరించి యువత దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వవద్దని సూచించారు. పోక్సో చట్టం గురించి వివరించి చిన్నారులపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేశారు. ఐపీఎల్ బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై పిల్లలకు అవగాహన కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసు అధికారుల సూచనలను శ్రద్ధగా వినిపించారు. ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు.