
గంగవరం,చిత్తూరు ఎక్స్ప్రెస్, జూన్ 21:
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని, బీసీ సంక్షేమానికి సంబంధించిన పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. పలమనేరు లయన్స్ క్లబ్లో శనివారం నిర్వహించిన సమావేశంలో నాయకులు ఏకగ్రీవంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీల సామాజిక, రాజకీయ సాధికారత కోసం చట్టసభల్లో తగిన రిజర్వేషన్లు కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు ప్రత్యేక ఉపకోటా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రంలో బీసీ భవనాల నిర్మాణం చేపట్టడంతో పాటు, పెండింగ్లో ఉన్న బీసీ కార్పొరేషన్ రుణాలను వెంటనే విడుదల చేసి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవాలని కోరారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పూసల రవి, హరి గోవిందు, గిరిధర్ మూర్తి, రఘురామ్, వీరభద్ర, భాస్కరయ్య వాల్మీకి, చిరంజీవి, షణ్ముగం, గోవిందు శ్రీనివాసులు, రావూరి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.