
శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 04:
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలానకి అత్యధిక రెవెన్యూ అందిస్తున్న బంగారమ్మ కాలనీలో మౌళిక వసతులు మెరుగు పరచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య విజ్ఞప్తి చేశారు. స్థానిక బంగారమ్మ ఆలయ ఆవరణలో గురువారం బంగారమ్మ కాలనీ అభివృద్ధి సేవా సంఘం సమావేశం జరిగింది. అంగేరి పుల్లయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పుల్లయ్య మాట్లాడుతూ కాలనీలో సుమారు వెయ్యి ఇళ్లు, 17 వీధులున్నా ఒక్కటంటే ఒక్క మురుగు కాలువ లేదని వాపోయారు. కాలనీ నుంచి అత్యధిక శాతం పన్నులు వసూళ్లవుతున్నా సీసీ రోడ్లకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సరఫరా అంతంతమాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరవకాలువలు ఆక్రమణకు గురవడంతో వర్షాకాలం ఇళ్ల ముందే మురుగు నీరు నిల్వ ఉంటోందని వాపోయారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి బంగారమ్మ కాలనీలో మౌళిక వసతులు మెరుగుపరచకుంటే సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య, సీఐటీయూ నాయకులు గంధం మణి, వెంకటేష్, గురునాధం, బంగారమ్మ కాలనీ అభివృద్ధి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సభ్యులు పాల్గొన్నారు.