
పీలేరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 02:
అన్నమయ్య జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం మోపుతున్నాయని NSUI రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పీలేరులో ఆయన మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. పేద, బలహీన వర్గాల విద్యార్థులకు విద్యాహక్కు చట్టం (RTE) ప్రకారం కల్పించాల్సిన ఉచిత ప్రవేశాలు, ఇతర సౌకర్యాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ వసూళ్లపై తనిఖీలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా NSUI ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మద్దెల అమృత్ తేజ హెచ్చరించారు. విద్యను అందరికీ అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, విద్యను వ్యాపారంగా మార్చే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.