
కడప,చిత్తూరు ఎక్స్ప్రెస్, జూలై 31:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా యువత, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగమధు యాదవ్ విమర్శించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నంది మండలం వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగమధు యాదవ్ మాట్లాడారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తే ఆయన పట్ల బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు ఖండనీయమన్నారు. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హాస్టళ్లలో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు విజయ్కుమార్, మైనుద్దీన్, నాయకులు పాలగిరి శివ, జనరల్ సెక్రటరీ అబ్దుల్ రఫ్, కరీం, మామిళ్ల బాబు, అవినాష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.