
గుడుపల్లి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 06:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం కోటచంబగిరి గ్రామంలో తమ కుటుంబానికి ప్రభుత్వం కేటాయించిన వ్యవసాయ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత మహిళ హారతి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007 సంవత్సరంలో నిర్వహించిన భూముల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తమ కుటుంబానికి వ్యవసాయ భూమి కేటాయించబడిందని ఆమె తెలిపారు. ఆ భూమికి సంబంధించిన పట్టాలు, ధ్రువపత్రాలు, రెవెన్యూ రికార్డులు సహా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అయితే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ భూమి తమదేనంటూ అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భూమి విషయంలో పలుమార్లు తమను బెదిరించడమే కాకుండా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. సమస్యపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు భూమిని సర్వే నిర్వహించి పరిశీలించారని తెలిపారు. సర్వే అనంతరం ఆ భూమి తమకే చెందినదిగా అధికారులు నిర్ధారించినప్పటికీ కొందరు వ్యక్తులు అధికారుల నివేదికను పట్టించుకోకుండా వివాదాన్ని కొనసాగిస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా తమ కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతూ బెదిరింపులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. భూమి వివాదం కారణంగా తమ కుటుంబం తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతోందని, అధికారుల ఆదేశాలను సైతం కొందరు వ్యక్తులు లెక్కచేయడం లేదని హారతి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రెవెన్యూ, పోలీసు అధికారులు జోక్యం చేసుకుని తమ భూమిని పరిరక్షించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు చేసిన ఆరోపణల నేపథ్యంలో సంబంధిత అధికారులు చేపట్టే చర్యలపై గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భూమి వివాదానికి త్వరితగతిన పరిష్కారం లభించి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.