chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 8:00 am Digital Edition : CHITTOORE EXPRESS

ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలి  టెలికాన్ఫరెన్స్‌లో కంచర్ల శ్రీకాంత్ పిలుపు

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 24:

కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. సోమవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సాధికార సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం పార్టీ నాయకుల బాధ్యత అని తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలను నమోదు చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు కుప్పం ప్రాంతానికి చేరడంతో రైతులకు కలిగిన ప్రయోజనాలను గ్రామాల వారీగా వివరించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేసిన వారిని కూడా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తమ వైపు ఆకర్షించేలా పనిచేయాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని, పార్టీ కుటుంబ సాధికార సభ్యులకు తగిన గుర్తింపు కల్పిస్తామని తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సాధికార సమితి సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.