
చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 13:
ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కారం) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 64 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. అనంతరం ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం సమగ్ర విచారణ నిర్వహించి, నిర్దేశిత గడువులోగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.., ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీసు శాఖను ఆశ్రయించినప్పుడు వారికి సత్వర న్యాయం అందించడం పోలీసుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా పరిశీలించి, త్వరితగతిన విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాన్-కేడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎస్. షాను, చిత్తూరు ఎస్డీపీఓ జె. వెంకటనారాయణ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. స్వీకరించిన 64 ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించినవి 18, డబ్బు తగాదాలు 10, పోలీసు సేవలకు సంబంధించినవి 8, ఆస్తి తగాదాలు 8, వేధింపులు 6, ఇంటి తగాదాలు 6, చిన్న గొడవలు 3, దొంగతనాలు 2, ద్విచక్రవాహన దొంగతనం 1, చీటింగ్కు సంబంధించిన ఫిర్యాదు 1 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అన్ని ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.