కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 08:
పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమంత్రి సహాయనిధి పథకం మరోసారి తన ప్రాముఖ్యతను చాటుకుంది. పట్టణంలోని 11వ క్లస్టర్ పరిధిలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. 11వ క్లస్టర్ ఇంచార్జి కన్నన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మునిసిపల్ టీడీపీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు అత్యవసర పరిస్థితుల్లో పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఖరీదైన వైద్య చికిత్సలు, ప్రమాదాలు, ఇతర అనివార్య పరిస్థితుల్లో ఈ నిధి ద్వారా ప్రభుత్వ సహాయం అందడం ప్రజలకు గొప్ప ఉపశమనమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి తక్షణ సహాయం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గ్రామాలు, పట్టణాల స్థాయిలో నాయకులు సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారని చెప్పారు. ప్రజలు ఈ పథకం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి, అవసరమైనప్పుడు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి నబి, యూనిట్ ఇంచార్జీలు అప్పు(ముఖేష్), సుబ్రమణి, సుభాన్ బాబు, స్థానిక పార్టీ అధ్యక్షుడు లోకేష్, బూత్ ఇంచార్జి ఎన్.కె.మణి ,మోహన్, మహేష్ ,పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంపై సంతోషం వ్యక్తం చేస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.