
వి.కోట,చిత్తూరు ఎక్స్ప్రెస్,జూన్ 15:
చిత్తూరు జిల్లా వి.కోట మండలం జవనపల్లి పాఠశాల పూర్వ విద్యార్థులు తమ చదువుకు పునాది వేసిన విద్యాలయానికి గుర్తుగా నూతన వేదికను నిర్మించి అందజేసి ఆదర్శంగా నిలిచారు. సుమారు రూ.2 లక్షల వ్యయంతో నిర్మించిన వేదికను సోమవారం పాఠశాలకు విరాళంగా అందజేశారు. జవనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలకు చెందిన 2005 నుంచి 2011 మధ్య కాలంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గత కొన్ని రోజులుగా సమావేశమై తమకు విద్యాబోధన చేసిన పాఠశాల అభివృద్ధికి ఏదైనా చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు. ఈ క్రమంలో పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో చర్చలు జరిపి పాఠశాలకు అత్యవసరం గా అవసరమైన వేదిక నిర్మించాలని నిర్ణయించారు. అనంతరం స్వచ్ఛందంగా నిధులు సమీకరించి సుమారు రూ.2 లక్షల వ్యయంతో వేదికతో పాటు పైకప్పును నిర్మించి పాఠశాలకు అందజేశారు. నూతనంగా నిర్మించిన వేదికను ఆ పాఠశాలలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన మాజీ ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ చేత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థులు చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని గ్రామస్తులు, ఉపాధ్యాయులు కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రస్తుత విద్యార్థుల్లో సేవాభావం, బాధ్యత పెంపొందించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యాసంస్థ అభివృద్ధికి ఇదే సహకారం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.