
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 30:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రారంభమైన ప్రజా–ప్రజల–ప్రైవేటు భాగస్వామ్య కార్యక్రమం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షుడు పి.ఎస్. మునిరత్నం కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ సలహా కమిటీ సభ్యులు, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో దత్తత తీసుకున్న కుటుంబాల సభ్యులతో నాయకులు ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పలు ప్రముఖ సంస్థలు భాగస్వామ్యమై వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాటి ద్వారా సామాజిక బాధ్యత పెరుగుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ఈ భాగస్వామ్య విధానం ప్రజల అభ్యున్నతికి తోడ్పడే వినూత్న కార్యక్రమంగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు.