
కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 09:
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని చందం గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పాలీహౌస్లలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి రైతులతో వ్యవసాయ పద్ధతులు, దిగుబడులు, మార్కెట్ అవకాశాలపై వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు జి ఎం రాజు చర్చించారు. అంతకుముందు కుప్పంలోని కడ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలీహౌస్లలో సాగు చేస్తున్న చామంతి, క్యాప్సికం పంటలను పరిశీలించి రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగు చేపడితే తక్కువ విస్తీర్ణంలోనే అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. పాలీహౌస్లలో చామంతి, క్యాప్సికం వంటి అధిక విలువ కలిగిన పంటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.3.50 లక్షల వరకు సబ్సిడీ అందజేస్తోందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఉద్యాన పంటల సాగు ద్వారా రైతుల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పాలీహౌస్ సాగుపై మరింత మంది రైతులు ఆసక్తి చూపి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.