chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 10:36 am Digital Edition : CHITTOORE EXPRESS

పల్లె ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన రామచంద్ర నాయుడు వి.కోట–నాయకనేరి ఆర్టీసీ బస్సు సేవలకు శ్రీకారం

వి.కోట, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 29:

 

చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని పలు గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. వీ.కోట నుంచి ఏడుచెట్లకోట, బీసీ పల్లి, సీఎం పల్లి, పొదుగుగడ్డ మీదుగా నాయకనేరి వరకు ఆర్టీసీ బస్సు సేవలను సోమవారం ప్రారంభించారు. ఈ బస్సు సేవలు అందుబాటులోకి రావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఈ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సి.రామచంద్ర నాయుడు కుప్పం డిపో డివిజనల్ మేనేజర్‌తో చర్చించి బస్సు సేవల ప్రారంభానికి కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కొత్తగా ప్రారంభించిన ఈ బస్సు నిరంతరాయంగా అన్ని గ్రామాలను అనుసంధానం చేస్తూ ప్రయాణికులకు సేవలందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం వి.కోట ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను కుప్పం డిపో డివిజనల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. బస్టాండ్ సుందరీకరణ, తాగునీటి వసతి, సీసీ రోడ్ల నిర్మాణం, నాణ్యమైన మరుగుదొడ్లు ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పించాలని కోరారు. దీనిపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రామచంద్ర నాయుడు బస్సును ప్రారంభించి రైతులు, ప్రయాణికులు, మహిళలు, కూటమి నాయకులతో కలిసి కొత్త మార్గంలో ప్రయాణించి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రవాణా సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.