chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 8:45 pm Digital Edition : CHITTOORE EXPRESS

పబ్లిక్ కొళాయిలు తొలగించడం అన్యాయం, పునరుద్ధరణకు చర్యలు తీసుకోండి మిద్దెల హరి డిమాండ్

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 18:

 

శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో దశాబ్దాలుగా ప్రజల వినియోగంలో ఉన్న పబ్లిక్ మంచినీటి కొళాయిలను తొలగించడం తీవ్ర అన్యాయమని వాటిని వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నామని మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి తెలియజేశారు.గత రెండు రోజులుగా పట్టణంలోని దాదాపు 40కు పైగా పబ్లిక్ మంచినీటి కొళాయిలను తొలగించడం జరిగిందని, ఇంకా మిగిలిన కొళాయిలను కూడా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పేద ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఈ మంచినీటి కొళాయిలను నిర్వహణ బాధ్యత పురపాలక సంఘ ఇంజనీరింగ్ విభాగానిదేనని పేర్కొన్నారు. పబ్లిక్ మంచినీటి కొళాయిలను ఏర్పాటు చేయాలన్నా, తొలగించాలన్నా తప్పనిసరిగా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఉండాలని, సంబంధిత నిబంధనలను అధికారులు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ హోదాలో ఉన్న శ్రీకాళహస్తి ఆర్డీవో ప్రత్యేక పాలనాధికారి అనుమతి ఆదేశాలు లేకుండా కొళాయిలను తొలగించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.అందువల్ల తొలగించిన పబ్లిక్ మంచినీటి కొళాయిలను తక్షణమే పునరుద్ధరించాలని పురపాలక సంఘ కమిషనర్‌తో పాటు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు న్యాయపోరాటం చేపడతామని తెలియజేశారు.