
కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 05:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు పురుషోత్తం (పూరి ఆర్ట్స్) తన వినూత్న కళా ప్రతిభతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. ఆడి కృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని నెమలి ఈకపై అత్యంత సూక్ష్మంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి చిత్రాన్ని చిత్రించి భక్తులను అబ్బురపరిచారు. ఆడి కృత్తిక సందర్భంగా ఈ ప్రత్యేక కళాఖండాన్ని వేల్ మురుగన్ స్వామికి సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని పురుషోత్తం తెలిపారు. ఎంతో శ్రమతో రూపొందించిన ఈ అరుదైన చిత్రానికి భక్తులు, కళాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నెమలి ఈకపై రూపొందించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పెయింటింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వినూత్న ఆలోచనతో సృష్టించిన ఈ కళాఖండాన్ని నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తూ చిత్రకారుడు పురుషోత్తం ప్రతిభను అభినందిస్తున్నారు.