chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 8:28 am Digital Edition : CHITTOORE EXPRESS

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. పోగొట్టుకున్న మొబైల్ యజమానికి అప్పగింత

శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 02:

 

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో ఓ ఆటో డ్రైవర్ చూపిన నిజాయితీ అందరి ప్రశంసలు అందుకుంది. రోడ్డుపై దొరికిన విలువైన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోకుండా పోలీసులకు అప్పగించి యజమానికి చేరేలా చేయడంతో స్థానికంగా అభినందనలు వెల్లువెత్తాయి. శాంతిపురం మండలం నడింపల్లి గ్రామానికి చెందిన గోవింద రాజులు వినాయక ఆటో స్టాండ్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా వెళ్తుండగా రోడ్డుపై పడిఉన్న ఒప్పో మొబైల్ ఫోన్‌ను గుర్తించారు. సుమారు రూ.28 వేల విలువ చేసే ఆ మొబైల్ ఫోన్‌ను వెంటనే రాళ్లబుదూగూ రు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించా రు. పోలీసులు మొబైల్ ఫోన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించి, అది శాంతిపురం మండలం శివపురం గ్రామానికి చెందిన బాలకృష్ణ పోగొట్టుకున్న మొబైల్ అని గుర్తించారు. అనంతరం అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసి మొబైల్ ఫోన్‌ను యజమాని బాలకృష్ణకు అప్పగించారు. ఈ సందర్భంగా రాళ్లబుదూగూరు ఉప పరిశీలకుడు ఐ. నరేష్ మాట్లాడుతూ, దొరికిన వస్తువులను నిజాయితీగా పోలీసులకు అప్పగించడం సమాజానికి ఆదర్శమన్నారు. గోవిందరాజులు చూపిన నిజాయితీ అభినందనీయమని కొనియాడారు.పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి దక్కడం తో బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేస్తూ గోవిందరాజులు, పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమకు దొరికిన పోగొట్టుకున్న వస్తువులను సమీప పోలీస్ స్టేషన్‌లో అప్పగించి వాటిని అసలు యజమానులకు చేరేలా సహకరించాలని ఉప పరిశీలకుడు ఐ. నరేష్ సూచించారు.