
కుప్పం, చిత్తూరు ఎక్స్ప్రెస్, జూలై 30:
కుప్పం మున్సిపాలిటీ 19వ వార్డుకు చెందిన ప్రతిభావంతురాలు, మూడో తరగతి విద్యార్థిని ఊర్వి శర్మను నారా భువనేశ్వరి బుధవారం తన నివాసంలో ఘనంగా సన్మానించారు. చిన్న వయస్సులోనే కరాటేలో విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన ఊర్వి శర్మను అభినందిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల నిర్వహించిన 6వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్లో విజయం సాధించిన ఊర్వి శర్మ, అనంతరం మైసూరులో జరిగిన 29వ ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్తో పాటు బ్రాంజ్ మెడల్ను కైవసం చేసుకుని కుప్పం ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన ఊర్వి శర్మ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణిస్తున్న బాలికలను ప్రోత్సహించడం సమాజం బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, పీకేఎం-యూడీఏ చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్బాబు, స్థానిక కౌన్సిలర్ జిమ్ దాము, మైనార్టీ అధ్యక్షుడు జాకీర్, తెలుగుదేశం పార్టీ నాయకులు సుగుణమ్మ, రాధమ్మ, ఊర్వి శర్మ తల్లిదండ్రులు తదితరులు పాల్గొని చిన్నారిని అభినందించారు.