chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 8:34 am Digital Edition : CHITTOORE EXPRESS

ధైర్య స్పర్శ కార్యక్రమంలో భాగంగా మదర్ తెరిస్సా కాలేజీలో  అవగాహన సదస్సు 

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి:

 

చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ధైర్య స్పర్శ” కార్యక్రమంలో భాగంగా గంగవరం మండలం మదర్ తెరిస్సా కాలేజీలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా పోలీసు అధికారి తుషార్ డూడి ముఖ్య అతిథిగా హాజరై, సుమారు వెయ్యి మంది విద్యార్థులతో మాట్లాడారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే తమ లక్ష్యమని, విద్యార్థులు చదువుతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ సైబర్ నేరాలపై హెచ్చరికసమావేశంలో పోలీసు అధికారి మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ వినియోగం తీవ్ర సమస్యగా మారుతోందని, ముఖ్యంగా యువత ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్య, మానసిక, కుటుంబ సమస్యలతో పాటు విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరించారు. అదేవిధంగా సైబర్ నేరాలపై కూడా విస్తృత అవగాహన కల్పించారు. ఇటీవల పెరుగుతున్న “డిజిటల్ అరెస్ట్” వంటి సైబర్ మోసాల గురించి వివరిస్తూ, అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజీలకు స్పందించవద్దని, వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు లేదా ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. హెల్మెట్ ధరించడం ప్రాణాలను కాపాడుతుంది రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం ప్రాణాలను కాపాడే ముఖ్యమైన రక్షణ చర్య అని పోలీసు అధికారి వివరించారు. వేగం పెంచితే ప్రమాదం పెరుగుతుంది, హెల్మెట్ పెడితే జీవితం నిలుస్తుందని నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు హెల్మెట్‌లను పంపిణీ చేశారు. త్వరలోనే చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎవరైనా హెల్మెట్ ధరించి తమ ఫోటోను తీసుకొని చిత్తూరు పోలీసు వాట్సాప్ నంబర్‌కు పంపడం లేదా చిత్తూరు పోలీసు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయడం ద్వారా పాల్గొనవచ్చని తెలిపారు. నిరంతరం 28 రోజుల పాటు హెల్మెట్ ధరించి ఫోటోలు పంపిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేయబడతాయని పేర్కొన్నారు. మహిళల భద్రతపై మైమ్ ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా కాలేజీ విద్యార్థులు “మహిళల భద్రత మనందరి బాధ్యత” అంటూ మైమ్ రూపంలో ప్రదర్శన ఇచ్చారు. డ్రగ్స్ నిర్మూలన మరియు సైబర్ నేరాల నివారణలో మీడియా వారు ముఖ్యపాత్ర పోషించాలని పోలీసు అధికారి కోరారు. సమాజంలో అవగాహన పెంపొందించడంలో మీడియా సహకారం చాలా అవసరమని, ముఖ్యంగా యువతను డ్రగ్స్ వంటి ప్రమాదకర అలవాట్ల నుండి దూరంగా ఉంచేందుకు మరియు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండేలా చేయడానికి మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప విభాగ పోలీసు అధికారి డా.తరుణ్ పహ్వ, పలమనేరు ఉప విభాగ పోలీసు అధికారి డేగల ప్రభాకర్, గంగవరం ఇన్స్పెక్టర్ రాంభూపాల్, ఎస్.బి. ఇన్స్పెక్టర్ మురళీమోహన్, మదర్ తెరిస్సా కరెస్పాండంట్ డా. రవీంద్ర బాబు, చైర్మన్ సునీల్, డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.