chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 9:14 am Digital Edition : CHITTOORE EXPRESS

దళితులపై అగ్రకుల దాడి ఆరోపణలు – నంజంపేటలో ఉద్రిక్తత

శాంతిపురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 20

 

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం నంజంపేట గ్రామంలో దళితులపై అగ్రకులానికి చెందిన వ్యక్తులు దాడి చేశారనే ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. గ్రామంలో దీపోత్సవం సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలలో మునెప్ప కుమారుడు కిరణ్ రాజేశ్ మరియు శ్రీరాములు కుమారుడు ప్రవీణ్ మధ్య ఆట విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదం స్వల్ప ఘర్షణకు దారితీసింది. అదే రోజు రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో శ్రీరాములు భార్య అనిత తమ బంధువులతో కలిసి సుమారు నలభై ఐదుగురు వ్యక్తులతో కిరణ్ కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో వారి ఇంటిపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో మహిళలు, పిల్లలు భయాందోళనలకు గురయ్యారని తెలిపారు. ఈ ఘటనపై బాధితులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ తమకు సరైన న్యాయం జరగలేదని వాపోతున్నారు. అంతేకాకుండా ఈ సంఘటనతో సంబంధం లేని రామకుప్పం మాజీ మార్కెట్ అధ్యక్షురాలు లలిత మురగేష్ పేరును కేసులో చేర్చడం తగదని స్థానికులు పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తికి నిజంగా ప్రమేయం ఉన్నదో లేదో పూర్తి వివరాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా న్యాయం ఎటువైపు ఉంటే ఆ వైపు నిలబడాలని గ్రామస్థులు పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని దళితులు విజ్ఞప్తి చేస్తున్నారు.