chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 5:37 pm Digital Edition : CHITTOORE EXPRESS

త్రైత సిద్ధాంత ప్రచార యాత్రకు విశేష స్పందన

తంబళ్లపల్లె,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,మే 23:

 

త్రైత సిద్ధాంత భగవద్గీత, శ్రీకృష్ణాష్టమి ఊరేగింపు విశిష్టతపై నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రచార యాత్ర శనివారంతో ముగిసింది. త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక నెల్లూరు కమిటీ, కుప్పం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎనిమిది రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలోని ఉప్పురోళ్లపల్లి, కొత్తపల్లి, కొటాల, బురుజులు, కొట్టాల ఏటిగడ్డ, వసంతపురం, జరపాటి దీన్నే, ఊజయ్య నాయక్ తాండా, ఆర్‌ఎన్ తాండా, గొల్లపల్లి, మాదిగపల్లి, ఎద్దుల వేమన్నగారి పల్లి, ఎద్దులవారికోట, బురుజుపల్లి, దిగువపల్లి, బండారువారిపల్లి, కమ్మవాండ్ల పల్లి, జుంజురుపెంట, గంజిగుంటవారిపల్లి, రామాపురం తదితర 20 గ్రామాల్లో ఇందూ ధర్మ ప్రచారం చేపట్టారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాల ప్రాముఖ్యత, భగవద్గీత సందేశాలను గ్రామస్తులకు వివరించారు. శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే ఊరేగింపు నిర్వహించాలనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సమితి సభ్యులు తెలిపారు. పూర్వకాలంలో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలను 11 రోజుల పాటు నిర్వహించి, చివరి రోజు ఊరేగింపుతో ముగించేవారని పేర్కొన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఊరేగింపు జరిగే గ్రామాల్లో ప్రకృతి వైపరీత్యాలు, రోగబాధలు దరిచేరవని పెద్దలు చెప్పిన మాటలను ప్రజలకు వివరించినట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విశేష స్పందన చూపారని సమితి సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక నెల్లూరు కమిటీ, కుప్పం కమిటీ సభ్యులు డి. సురమౌళి, కృష్ణ, వెంకటేష్, రాధ, లక్ష్మయ్య, విజయమ్మ, రమ, కావ్యశ్రీ, సుమలత, కీర్తిశ్రీ, అవినాశ్, శ్రీదేవి, జ్ఞానేశ్వర్, శేఖర్, సునీత, నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.