chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 8:09 am Digital Edition : CHITTOORE EXPRESS

డ్యాన్స్ కళలో ప్రతిభ వికాసానికి వర్క్‌షాప్ ఢీ-19 విజేత మనోజ్ మార్గదర్శనం..  ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 04:

 

చిత్తూరు జిల్లా కుప్పంలోని డీ2డీ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో మాస్టర్ శ్రావణ్ నేతృత్వంలో ప్రత్యేక డ్యాన్స్ వర్క్‌షాప్ ఘనంగా నిర్వహించారు. నృత్య కళపై ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఆధునిక శిక్షణ అందించడంతో పాటు వారి ప్రతిభను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథిగా ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ నృత్య కార్యక్రమం ఢీ-19 విజేత మాస్టర్ మనోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నృత్యంలోని వివిధ మెళకువలు, క్రమశిక్షణ, వేదికపై ప్రదర్శన నైపుణ్యాలు, పోటీల్లో రాణించే విధానం, నృత్య రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై సమగ్రంగా వివరించారు. కళాకారులు నిరంతర సాధనతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించు కుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. వర్క్‌షాప్‌లో వంద మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ నృత్య శైలులపై ప్రత్యేక శిక్షణ పొందారు. మాస్టర్ మనోజ్ విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమై వారి సందేహాలను నివృత్తి చేస్తూ నృత్య ప్రదర్శనల్లో పాటించాల్సిన అంశాలను వివరించారు. విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సలహాదారు లయన్ ఎ.మహేష్,సిరి కళాక్షేత్రం సంస్థ నిర్వాహకురాలు కే.పీ. సునీత మహేష్,డ్యాన్స్ మాస్టర్లు పాల్‌రాజ్, సాయి శివ, పంకజ్, పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో అపారమైన కళా ప్రతిభ దాగి ఉందని, ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు వారి ప్రతిభను వెలికితీయడానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్ శ్రావణ్‌ను అతిథులు అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను తరచుగా నిర్వహించి విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నిపుణుల నుంచి ప్రత్యక్షంగా శిక్షణ పొందడం ఎంతో ఆనందంగా ఉందని, నృత్య రంగంలో తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవడానికి ఈ వర్క్‌షాప్ ఉపయోగపడిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వాహకులను కోరారు.