
కుప్పం,చిత్తూరు ఎక్స్ప్రెస్,మే 23:
తిరుపతి నగరంలో నిర్వహించిన కంబైన్డ్ చిత్తూరు జిల్లా డెడ్ లిఫ్టింగ్ పోటీల్లో కుప్పం పట్టణానికి చెందిన అవెంజర్స్ జిమ్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పలు పతకాలను కైవసం చేసుకున్నారు. పోటీల్లో పాల్గొన్న నలుగురు క్రీడాకారులు తమ ప్రతిభతో కుప్పం పట్టణానికి గుర్తింపు తీసుకువచ్చారు. మహిళా విభాగంలో స్వాతి అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించింది. పురుషుల విభాగంలో 61 కేజీల కేటగిరిలో సందీప్ ద్వితీయ స్థానం దక్కించుకోగా, 75 కేజీల కేటగిరిలో అర్ఫత్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. అలాగే 85 కేజీల విభాగంలో గజేంద్ర రెండో స్థానం సాధించి ప్రతిభ చాటాడు. పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను అవెంజర్స్ జిమ్ యజమాని గజ అభినందించారు. క్రమశిక్షణతో శిక్షణ తీసుకుంటే రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా మంచి విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడాకారుల విజయంపై కుప్పం పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.