
శాంతిపురం,చిత్తూరు ఎక్స్ప్రెస్, జూన్04:
రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బారామతి సర్కిల్ వద్ద గురువారం ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు చేపట్టారు. ఎస్సై ఐ.నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న పలువురిని గుర్తించి చట్టప్రకారం జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనల ను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటించా లని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం ప్రమాదకరమని, ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. జూన్ 5 నుంచి హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై రూ.1,035 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించా రు. శాంతిపురం మండల ప్రజలు తప్పని సరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. అతివేగం, త్రిపుల్ రైడింగ్, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రత ప్రతిఒక్కరి బాధ్యత అని,ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించ వచ్చన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేకతనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై స్పష్టం చేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.