chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 4:22 am Digital Edition : CHITTOORE EXPRESS

టీడీపీకి కార్యకర్తలే అసలైన బలం: నారా భువనేశ్వరి కుప్పం పర్యటన మూడో రోజు మహిళలు, రైతులు, విద్యార్థులతో ముఖాముఖి – అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 29

 

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, పార్టీ జెండాను ఎత్తిన కార్యకర్తలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గరని నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ కార్యకర్తలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మూడో రోజు వసనాడు, పెదబంగారుతనం, వేపూరు తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆమె మహిళలు, రైతులు, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం వసనాడులో మహిళలతో జరిగిన సమావేశంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమాన్నే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. “తల్లికి వందనం” వంటి పథకాల ద్వారా విద్యార్థుల చదువుకు ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలతో కుప్పానికి ఉపాధి అవకాశాలు కుప్పం నియోజకవర్గానికి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకువస్తూ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని భువనేశ్వరి పేర్కొన్నారు. హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చి కుప్పం ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. పెదబంగారుతనంలోని హార్టికల్చర్ హబ్‌ను సందర్శించిన ఆమె మహిళా రైతులు అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ విధానాలను పరిశీలించారు. ఒక్క పంటపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు. గురువులను గౌరవించాలి – ఏఐను అవసరానికి అనుగుణంగా వినియోగించాలి వసనాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన నారా భువనేశ్వరి, ప్రతి విద్యార్థి మొక్కలు నాటే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. గురువుల ను గౌరవించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని చదువులో రాణించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. జీవితంలో తనకు తల్లి, భర్త చంద్రబాబు నాయుడు ఎంతో ప్రేరణనిచ్చారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతలో భాగమైన కృత్రిమ మేధ (ఏఐ)ను అవసరమైన మేరకే వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యకర్తలకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది వేపూరులో మహిళలు, పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడి అరెస్టుకు వ్యతిరేకంగా మహిళలు, కార్యకర్తలు చూపిన సంఘీభావాన్ని గుర్తు చేశారు. “నిజం గెలవాలి” యాత్ర సమయంలో కార్యకర్తలు అందించిన అండను ఎప్పటికీ మరువలేమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తూ “సూపర్ సిక్స్” పథకాలతో ప్రజలకు మేలు చేస్తోందని చెప్పారు. అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం, పింఛన్లు, గృహనిర్మాణం వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతోందన్నారు. వేపూరు పంచాయతీలో రూ.52 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, 15 గోకులం షెడ్ల ఏర్పాటు, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 150 ఇళ్ల మంజూరు, ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా వాటర్ ట్యాంకుల ఏర్పాటు, జడ్పీ పాఠశాలకు భవనాల నిర్మాణం, 700 మందికి “తల్లికి వందనం”, 527 మందికి పింఛన్లు, రాములవారి ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షల మంజూరు వంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆమె వివరించారు.