
కుప్పం,చిత్తూరు ఎక్స్ప్రెస్, ఆగస్టు 29:
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, బలిజ నేత జేబీ శ్రీనివాస్ నాయుడికి ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలని రాష్ట్ర కాపు సామాజిక వర్గ పొలిటికల్ జేఏసీ అధికార ప్రతినిధి జలపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ విడుదల చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయుడిపై దాడులకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమలో గతంలో పలువురు బలిజ, కాపు నాయకులపై దాడులు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజంగా ఉండాలని, హింస, దాడులు సంప్రదాయం కాదని పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదన్నారు. శ్రీనివాస్ నాయుడి భద్రతపై ప్రభుత్వం తక్షణమే సమీక్షించి, ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఆయనకు ఎలాంటి హాని జరిగినా సంబంధిత రాజకీయ నేతలదే బాధ్యత అని జలపతి ఆరోపించారు.