chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 8:13 am Digital Edition : CHITTOORE EXPRESS

జనసంద్రంగా మారిన పెద్దపులి  గంగమాంబ ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో ఘనంగా గంగ జాతర

వి.కోట,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,మే 26:

 

చిత్తూరుజిల్లా పలమనేరు నియోజక వర్గం వి.కోట పట్టణంలోని గంగమ్మ వీధిలో వెలసిన శ్రీ పెద్దపులి గంగమాంబ వార్షికోత్సవ గంగ జాతర ఉత్సవాలు మంగళవారం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో జనసంద్రంగా మారింది. సోమవారం ఉదయం 11 గంటలకు అమ్మవారి శిరస్సు, గరిగతో జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మేళతాళాలు, పలకలు, డప్పుల వాయిద్యాల నడుమ ప్రారంభమైన ఊరేగింపు పట్టణ ప్రధాన వీధుల గుండా భక్తి పారవశ్యంతో సాగింది. బజారు మార్గం నుంచి దుర్గానగర్‌లోని శ్రీ దుర్గామాత ఆలయం వరకు అమ్మవారి శిరస్సు, గరిగలను ప్రత్యేకంగా ఊరేగించారు. అనంతరం ఈశ్వర్ నగర్, హరిజనవాడ ప్రాంతాల గుండా గంగమాంబ వీధికి చేరుకున్న ఊరేగింపు మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం, అమ్మవారి నామస్మరణతో పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ఆలయం వద్ద అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమంతో అమ్మవారి శిరస్సు, గరిగ ఊరేగింపు ముగిసింది. భక్తులు అమ్మవారికి పొంగులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి అంబలిని భక్తులకు పంపిణీ చేశారు. పూజలు ముగిసిన అనంతరం ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా, సుమారు అరగంట పాటు కురిసిన వర్షాన్ని భక్తులు అమ్మవారి కృపగా భావించి ఆనందం వ్యక్తం చేశారు. వర్షం రావడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. జాతర సందర్భంగా పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించబడగా, ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.