
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 14:
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘జననాయకుడు’ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీఎంకే-యూడీఏ చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్ బాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలను నుండి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుని వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి సమస్యను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో ప్రజలకు మరింత చేరువగా ఉండే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజలతో నిరంతరం అనుసంధానంగా ఉండటం, వారి సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపడం, ప్రజా సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. “ప్రజల విశ్వాసమే మా బలం… ప్రజాసేవే మా ధ్యేయం” అనే నినాదంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు కొనసాగిస్తామని మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు స్పష్టం చేశారు. కార్యక్రమానికి పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.