chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:13 am Digital Edition : CHITTOORE EXPRESS

జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్ మరో నిందితుడి కోసం గాలింపు: డీఎస్పీ

వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 30:

 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా విలేఖరి దొరస్వామిని గుర్తించి ఐదో నిందితుడిగా అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐ సోమశేఖర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, దర్యాప్తులో దొరస్వామికి జగన్మోహన్ రెడ్డితో గత విభేదాలు ఉన్నట్లు, అదే కక్షతో శ్రీనివాసులు, తమీమ్ తదితరులతో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు తేలిందన్నారు. హత్యకు ముందు ప్రధాన నిందితులను ప్రేరేపించి, వారికి సహకరించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు తమీమ్, సుభాన్, సలీం,శ్రీనివాసులు,గణపతి, దొరస్వామి తో పాటు పలువురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరో వ్యాపారవేత్త పాత్రపై కూడా ఆధారాలు లభించాయని, అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.అదేవిధంగా, ప్రభుత్వ అధికారులు, పోలీసుల పేర్లు చెప్పి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని నమ్మబలికి డబ్బులు వసూలు చేసిన పలు ఘటనలు దర్యాప్తులో బయటపడ్డాయని డీఎస్పీ తెలిపారు. నకిలీ పత్రాలు, భూ వివాదాలు, సెటిల్‌మెంట్ల పేరుతో పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి మోసగాళ్లను నమ్మవద్దని, ఎవరైనా డబ్బులు ఇచ్చి మోసపోయినట్లయితే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ డేగల ప్రభాకర్ స్పష్టం చేశారు.