
సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే 24:
సూళ్లూరుపేటలో ప్రసిద్ధి చెందిన చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ ఆర్వీ కుమార్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు ఏజీ కిషోర్ ఆధ్వర్యంలో ఆలయానికి చేరుకున్న ఆర్వీ కుమార్కు ఆలయ అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్వీ కుమార్ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ మురళిరెడ్డి, రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎలెంబెట్టి బుజ్జయ్య, తిరుపాలు, పోతయ్య, వెంకటేశ్వర్లరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ ప్రాంగణం భక్తులు, స్థానిక నాయకులతో సందడిగా మారి భక్తిశ్రద్ధలతో కళకళలాడింది.