తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి డీఆర్పీలు
కేవీబీ పురం, చిత్తూరు ఎక్స్ప్రెస్
కేవీబీ పురం చిన్నారులకు చిన్ననాటి నుంచే మంచి విలువలు, ఆదర్శాలను నేర్పించడంతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని డీఆర్పీలు శంకరయ్య, గిరీష్కుమార్, తుకారం, సూపర్వైజర్లు రాజేశ్వరి, బజావతి సూచించారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టు పిచ్చాటూరు పరిధిలోని కేవీబీ పురం మండలంలో 60 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు అవగాహన, నైపుణ్యాలు, సేవా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఆరు రోజులపాటు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో కేవీబీ పురం మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రీ-స్కూల్ విద్యతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో అంగన్వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విధుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలను శిక్షణ ద్వారా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సిన సేవలు, పిల్లల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధిని గుర్తించే విధానం, ఆటలు, పాటలు, వివిధ కార్యకలాపాల ద్వారా ప్రీ-స్కూల్ విద్యను అందించే పద్ధతులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు, సమాజంతో సమర్థవంతంగా కమ్యూనికేషన్ నిర్వహించే నైపుణ్యాలను కూడా పెంపొందిస్తున్నట్లు చెప్పారు.
ఆరోగ్యకరమైన బాల్యం–బలమైన భవిష్యత్తు లక్ష్యంగా అంగన్వాడీ కార్యకర్తలు జ్ఞానం, సేవాభావం, బాధ్యతతో పనిచేసి సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మీపతి, ఎంఈఓ-2 రవికుమార్, జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్, సూపర్వైజర్లు రాజేశ్వరి, బజావతి, డీఆర్పీలు శంకరయ్య, గిరీష్కుమార్, తుకారం తదితరులు పాల్గొన్నారు.
