తొట్టంబేడు, చిత్తూరు ఎక్స్ప్రెస్
తొట్టంబేడు మండలం రానున్న పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని తొట్టంబేడు ఎంపీడీవో సురేంద్రనాథ్ సూచించారు. ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో భాగంగా తొట్టంబేడు మండలం చిట్టతూరు గ్రామ పంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవో సురేంద్రనాథ్, డిప్యూటీ ఎంపీడీవో గిరిధర్, చిట్టతూరు గ్రామ అభివృద్ధి సచివాలయ అధికారి శాంతితో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో సురేంద్రనాథ్ మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతి పంచాయతీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ముందుగానే సేకరించుకోవాలని సూచించారు. ఎన్నికలను పూర్తి బాధ్యతతో నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలన్నారు.అలాగే గ్రామాల్లోని ఓటర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, పోలింగ్ కేంద్రాల పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఆయా పంచాయతీల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలను అధికారులకు తెలియజేయడంతో పాటు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసుకోవాలని ఎంపీడీవో ఆదేశించారు.

