
శాంతిపురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,జూన్15:
కూటమి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించేందుకు శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు పంచాయతీ పరిధిలోని శేషాద్రిపురం గ్రామంలో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాళ్లబూదుగూరు యూనిట్ ఇన్చార్జ్ ఆర్ఎస్ మణి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పంచాయతీ కార్యదర్శి శివశంకరయ్య హాజరై గ్రామ ప్రజలతో కలిసి పలు అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ మణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. గత రెండేళ్లలో రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమ పథకాల అమలులో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా చేరేలా పారదర్శక పాలన అందుతోందని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామ ప్రజలకు అవసరమైన తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ప్రజలు తెలిపిన సమస్యలు, వినతులు, సూచనలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్ఎస్ మణి పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బీఎం కుమార్, గ్రామ పెద్దలు రత్నప్ప, సుధారాణి, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ పథకాలపై అవగాహన పొందడంతో పాటు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.