శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 20:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా సోమవారం టీడీపీ శ్రేణులు శాంతిపురం నుండి కుప్పం వరకు భారీ బైక్ ర్యాలీ తోపాటు అన్నా క్యాంటీన్లో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పసుపు చొక్కాలు,టోపీలు, కండువాలతో హాజరయ్యారు. పార్టీ జెండా, పసుపు గొడుగుతో అలంకరించిన బైక్తో ర్యాలీని ప్రారంభించారు. శాంతిపురం నుండి బయలుదేరిన బైక్ ర్యాలీ కుప్పం పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగింది. ఈ సందర్భంగా టీడీపీ మండలపార్టీ అధ్యక్షుడు ఎన్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యకర్తలంతా ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం” అని తెలిపారు. ర్యాలీ అనంతరం మండలంలో అన్ని గ్రామాల్లో కేక్ కట్ చేసి, బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని “జై చంద్రబాబు”, “జై టీడీపీ” నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మండలంలోనితెలుగు దేశం పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్లు, యూనిట్ ఇన్చార్జిలు క్లస్టర్ ఇన్చార్జిలు తెలుగుదేశం ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.