chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 9:58 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఘనంగా వార్డు సభ నిర్వహణ

జడ్చర్ల,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్04:

 

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో గురువారం ప్రేమ్ రంగ గార్డెన్‌లో వార్డు సభను ఘనంగా నిర్వహించారు. వార్డు ప్రజల సమస్యలు, పారిశుద్ధ్యం, ఆరోగ్య పరిరక్షణ, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్, మేనేజర్ లక్ష్మన్న, రెవెన్యూ అధికారి సలాం, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగేష్, వార్డు అధికారులు ఎం. అశ్విని, డి. కృష్ణయ్య, డాక్టర్ శ్వేత, ఆర్పీలు సరిత, స్వాతి, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు శ్యామల, పెంటమ్మ, ఆశా కార్యకర్త మంగమ్మతో పాటు ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. సభలో కమిషనర్ గిరీష్ మాట్లాడుతూ ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ స్వచ్ఛ ఆటోలకు అందించాలని సూచించారు. వ్యర్థాల వేరు చేయడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడటంతో పాటు చెత్త నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల ఆవరణల్లో, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమల లార్వా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి కుటుంబం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. “స్వచ్ఛ జడ్చర్ల – స్వచ్ఛ వార్డు” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే పరిశుభ్రమైన పట్టణ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనంత కిషన్, అశోక్ రెడ్డి, అశోక్, కండి కృష్ణ, భరత్ సింహారెడ్డి, చంద్రమౌళి, ఇతర వార్డు ప్రజలు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.